కలం, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య చదవడానికి నిర్వహించే నీట్ యూజీ 2026 (NEET UG 2026) ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ నీట్ పరీక్ష మే 3న జరుగుతుంది. ఆ రోజు ఒకే సెషన్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్, తెలుగుతోపాటు మరో 11 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది.
ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. చివరి తేదీ మార్చి 8. దరఖాస్తుల్లో మార్పుచేర్పులు మార్చి 10 నుంచి 12 వరకు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు జనరల్కు రూ.1,700; ఈడబ్ల్యూఎస్/ఓబీసీ–ఎన్సీఎల్కు రూ.1,600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, థర్డ్ జెండర్ వాళ్లకు రూ.1,000. విదేశీ అభ్యర్థులకైతే రూ.9,500 ఫీజు ఉంటుంది. దరఖాస్తు రుసుముకు ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ అదనం.
రిజిస్ట్రేషన్లో ఈ మార్పులు..
- ఐడీ గుర్తింపుకోసం ఆధార్ ఈకేవైసీ ఉండాలి.
- దరఖాస్తు సబ్మిట్ చేసే సమయంలో అభ్యర్థి లైవ్ ఫోటో క్యాప్చర్ చేయాలి. ఇది, ఆధార్ కార్డుతో సరిపోవాలి. ఒకవేళ సరిపోలక పోతే అభ్యర్థి గుర్తింపును తెలిపే ఇతర ధ్రువపత్రాలు సమర్పించాలి .
- పరీక్ష కేంద్రం: అభ్యర్థి శాశ్వత లేదా తాత్కాలిక నివాసం ఆధారంగా పరీక్ష కేంద్రాన్ని నిర్ణయిస్తారు (NEET UG 2026).
దరఖాస్తు ఎలా చేయాలంటే?
మొదట https://neet.nta.nic.in/ వెబ్సైట్లోకి వెళ్లి ‘న్యూ రిజిస్ట్రేషన్’ లింక్ మీద క్లిక్ చేయాలి. అందులో అడిగే వివరాలను ఇవ్వాలి. దీంతో అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. వీటి ఆధారంగా అప్లికేషన్ ఫామ్లో లాగిన్ కావాలి. అందులో అడిగే డీటైయిల్స్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫామ్ను సబ్మిట్ చేయాలి. పూర్తయిన అప్లికేషన్ ఫామ్ను ప్రింటవుట్ తీసుకోవాలి.
మరిన్ని వివరాలు https://neet.nta.nic.in/ వెబ్సైట్లోని నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
Read Also: మున్సిపోల్స్.. కుంభస్థలంపై కాంగ్రెస్ ఫోకస్
Follow Us On: Sharechat


