కలం, వెబ్డెస్క్: బంగ్లాదేశ్లో (Bangladesh) హిందువులపై దారుణాలు చల్లారడం లేదు. మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టినప్పటి నుంచి భారత వ్యతిరేక అల్లర్ల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు హిందూ వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి కీలక హిందూ నేత, మాజీ ఎంపీ, మంత్రిగా కూడా పనిచేసిన 85 ఏళ్ల రమేశ్ చంద్ర సేన్ (Ramesh Chandra Sen) చేరారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల కారణంగా దాదాపు ఏడాది నుంచి జైలులో ఉంటున్న ఆయన శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
దినాజ్పూర్ జిల్లా కారాగారంలో ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా కాలుజారి కింద పడడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని, అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారని స్థానిక పోలీసులు అంటున్నారు. అయితే, దీనిపై బంగ్లాదేశ్లోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎంతో మంచివాడిగా, ఆపదల్లోనూ, అవసరాల్లోనూ ఆదుకునే వ్యక్తిగా పేరుపొందిన రమేశ్ చంద్ర సేన్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణవార్తను ఫేస్బుక్లో షేర్ చేస్తూ ‘ప్రిజన్ మర్డర్’, ‘కస్టోడియల్ డెత్’ అంటూ తమ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగడం లేదని మరోసారి ప్రపంచానికి చాటి చెబుతోందంటూ మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై వాళ్లు మండిపడుతున్నారు.
అందరికీ సహాయం చేస్తూ..
రమేశ్ చంద్ర సేన్ (Ramesh Chandra Sen) ఏప్రిల్ 30, 1940న పుట్టారు. రంగపూర్ కార్మికేల్ కాలేజీలో బీఏ చదివారు. అందరికీ సహాయం చేస్తూ ఎంతో మంచివాడుగా పేరు తెచ్చుకున్నారు. ఠాకూర్గావ్–1కు ఎంపీ స్థానానికి 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మొదటి సారి రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత మరో నాలుగుసార్లు ఎంపీగా విజయం సాధించారు. అవామీ లీగ్ కేంద్ర కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు షేక్ హసీనా కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
2024లో జరిగిన ఆందోళనల కారణంగా షేక్ హసీనా (Sheikh Hasina) పదవి కోల్పోయి భారత్కు రాగా, అవామీ లీగ్ నాయకులపై అనేక కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో చాలా మంది నేతలు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. అయితే, తాను ఎవరికీ శత్రువును కానని, తాను ఎలాంటి తప్పు చేయలేదని ధీమాతో ఉన్న రమేశ్ చంద్ర సేన్ను బంగ్లాదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపారు. ఇప్పుడు ఆయన మరణంతో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, మానవహక్కుల ఉల్లంఘనపై మరోసారి చర్చ జరుగుతోంది. వృద్ధుడైన రమేశ్ చంద్ర సేన్ చేతులను పోలీసులు తాళ్లతో కట్టి తీసుకెళ్లిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీన్ని చూసి మంచి మనిషిని, లీడర్ను కోల్పోయామంటూ బంగ్లాదేశీయులు సైతం కన్నీరు పెడుతున్నారు.
Read Also: ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
Follow Us On: Instagram


