కలం, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ నేతల ఇండ్లపై దాడులు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎందుకు మౌనంగా ఉంటున్నారని వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా కనీసం ఈ దారుణమైన దాడులపై ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వైసీపీ నాయకుడు జోగి రమేష్ (Jogi Ramesh) ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో శనివారం బొత్స సత్య నారాయణ ఆయనను పరామర్శించేందుకు ఇబ్రహీంపట్నం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్, అంబటి రాంబాబు (Ambati Rambabu)ల ఇండ్లపై టీడీపీ గూండాలు అమానుషంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దగ్గరుండి దాడుల్ని ప్రోత్సహించారని ఆరోపించారు.
అసలు రాష్ట్రంలో ప్రజా స్వామ్యం, పరిపాలన అనేవి ఉన్నాయా అని బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రశ్నించారు. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారని, అలా హత్య చేయడానికి వచ్చిన వారికి స్టేషన్లో బెయిల్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై 304 సెక్షన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జోగి రమేష్ మాట్లాడిన దాంట్లో అసలు తప్పేముందని నిలదీశారు. మంత్రి నారా లోకేశ్తో పాటు, సీఎం చంద్రబాబుకు కూడా చిప్ పోయిందని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డూ అంశం నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంకా కూటమి నేతలు రాజకీయాల్లోకి దేవుడిని లాగుతూనే ఉన్నారని విమర్శించారు. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Also: జగన్ ఎక్కడ కాలు పెడితే అక్కడ అరిష్టం: మాజీ ఎమ్మెల్యే
Follow Us On: X(Twitter)


