కలం, వెబ్ డెస్క్ : ప్రపంచకప్ మ్యాచ్లకు వాంఖడే స్టేడియం (Wankhede Stadium) మరోసారి ముస్తాబవుతోంది. టీ20 వరల్డ్ కప్ 2026లో (T20 World Cup) భారత్ తన ప్రయాణాన్ని ఫిబ్రవరి 7న యూఎస్ఏతో ప్రారంభించనుంది. ఇదే టోర్నమెంట్కు తాజాగా అప్డేట్ షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు సాగే ఈ 20 జట్ల టోర్నమెంట్ను భారత్, శ్రీలంక కలిసి నిర్వహించనున్నాయి. గ్రూప్ Aలో భారత్తో పాటు పాకిస్తాన్, నమీబియా, USA, నెదర్లాండ్స్ ఉన్నాయి.
2024లో దక్షిణాఫ్రికాపై ఫైనల్ గెలిచి డిఫెండింగ్ చాంపియన్గా నిలిచిన భారత్, హోం గ్రౌండ్లో మూడో టైటిల్పై దృష్టి పెట్టింది. ఈసారి వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. వాంఖడే స్టేడియంలో భారత్ ఇప్పటివరకు ఆరు T20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. అందులో నాలుగు విజయాలు, రెండు పరాజయాలు నమోదయ్యాయి. తొలి మ్యాచ్ 2012లో జరగగా, చివరి మ్యాచ్ 2025లో జరిగింది.
2025లో ఇంగ్లాండ్తో జరిగిన తాజా మ్యాచ్లో భారత్ భారీ 150 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్లో అభిషేక్ శర్మ 54 బంతుల్లో 135 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2023లో శ్రీలంకపై రెండు పరుగుల తేడాతో గెలిచిన భారత్కు శివమ్ మావి నాలుగు వికెట్ల ప్రదర్శన తోడైంది. దీనికి ముందు 2019లో వెస్టిండీస్పై 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ హాఫ్సెంచరీలు నమోదు చేశారు. 2017లో కూడా శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది.
వాంఖడేలో (Wankhede Stadium) భారత్కు పరాజయాలూ ఉన్నాయి. 2012లో ఇంగ్లాండ్ చేతిలో తొలి మ్యాచ్లో ఓటమి ఎదురైంది. అలాగే 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. ఆ అనుభవాలను పక్కనపెట్టి, 2026 వరల్డ్ కప్ను విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో భారత్ వాంఖడేలో బరిలోకి దిగనుంది. టోర్నమెంట్ ప్రారంభంతో పాటు అభిమానుల అంచనాలు కూడా పెరుగుతున్నాయి.
Read Also: ఆ మ్యాచ్కు రొనాల్డో మళ్ళీ దూరం
Follow Us On: X(Twitter)


