కలం, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ (Gadchiroli Encounter) లో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన లోకేటి చందర్ రావు అలియాస్ ప్రభాకర్ సహా ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఘటనలో ఓ పోలీస్ సైతం గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మూడు రోజుల నుంచి గడ్చిరోలి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి స్పెషల్ యాంటీ నక్సల్స్ దళాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి నారాయణపూర్–గడ్చిరోలి సరిహద్దులోని ఫూడెవాడ గ్రామం వద్ద భద్రతా దళాలకు నక్సలైట్లు ఎదురయ్యారు.
దీంతో ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మూడు మృతదేహాలను గురువారం రాత్రే స్వాధీనం చేసుకున్న దళాలు.. శుక్రవారం మరో నలుగురి మృతదేహాలను గుర్తించాయి. చనిపోయినవాళ్లలో గడ్చిరోలి మావోయిస్ట్ డివిజన్ కమిటీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ అలియాస్ లోకేటి చందర్ రావు (Loketi Chandar Rao) ఉన్నారు. ఈయనపై రూ.20లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మిగిలినవాళ్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, సెర్చింగ్ కొనసాగుతోందని వాళ్లు వెల్లడించారు.
1995 నుంచి అజ్ఞాతంలో..
కామారెడ్డిలోని ఇస్రోజివాడి సదాశివ నగర్కు చెందిన లోకేటి రాంచందర్ రావు కుమారుడు లోకేటి చందర్ రావు(57). ఈయన 7వ తరగతి వరకు చదివారు. మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితులై ఉద్యమ బాట పట్టారు. 1995 నుంచి అజ్ఙాతంలో ఉన్నారు. ఉద్యమ సమయంలో స్వామి, పడకల స్వామి, రవి, ప్రభాకర్ అనే పేర్లు ఉన్నాయి. దళంలో ఎస్సీఎం, ఎస్ఎంసీ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. 4వ కంపెనీకి ఇన్చార్జిగా ఉన్నారు. గడ్చిరోలి మావోయిస్ట్ డివిజన్ కమిటీలో వెస్ట్ రీజనల్ కమాండ్(డబ్ల్యూఆర్సీ) కార్యదర్శిగా పనిచేశారు.


