కలం, వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లా యంత్రాంగంతో కలిసి వద్దిపేట, పుసుగుప్ప గ్రామాల మధ్య రూ. 4.50 కోట్ల వ్యయంతో బ్రిడ్జిని నిర్మిస్తోంది. ఈ మేరకు ఎస్పీ బి. రోహిత్ రాజు శుక్రవారం పరిశీలించారు. మారుమూల గ్రామాల ఆదివాసీలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ వంతెన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ బ్రిడ్జి ఏర్పాటుతో ఏజెన్సీ ప్రాంతాలు, ప్రధాన పట్టణాల మధ్య రాకపోకలు కొనసాగనున్నట్లు తెలిపారు.
అలాగే యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పూజారిగూడెం శివార్లలో రూ. 75 లక్షలతో నిర్మించిన క్రీడా మైదానంలో ‘సీఎం కప్’ (CM Cup) టోర్నమెంట్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ ప్రారంభించారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. ఈ ప్రాంత యువత ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని, ఇలాంటి పోటీలు వారి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఏజెన్సీ యువత అన్ని రంగాల్లో రాణించేందుకు జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు.


