కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయనున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ (TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గతంలో తెలంగాణపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మాతో పాటు ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సినిమా నటుడిగా పవన్ను ఆదరిస్తామని తెలిపారు. తాను చిరంజీవి అభిమాని అని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పవన్ మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారానికి ముందు తాను చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీజేపీ(BJP) వాళ్లు ఈరోజు పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లి మోకరిల్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు తెలంగాణలో దిక్కు లేక, ఇక్కడ ఏం చేసినా ఓట్లు పడే ఛాన్స్ లేదని పవన్ దగ్గరకు వెళ్లారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల కోసం పవన్ దగ్గరకు వెళ్లారంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. గతంలో పవన్ కల్యాణ్ కోనసీమ రైతాంగానికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించే మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief) పై విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.
Read Also: పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఎమ్మెల్యే ధన్పాల్ ప్రచారం
Follow Us On : WhatsApp


