కలం, వెబ్ డెస్క్: జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రాత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పవన్ ఎన్నికల్లో బీజేపీ(BJP)కి మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కూడా హామీ ఇచ్చారు. ఈ మేరకు జనసేన(JanaSena), బీజేపీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఫిబ్రవరి 7వ, 8వ తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పవన్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఇరు పార్టీల అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, స్నేహపూర్వక వాతావరణంలో క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యే దిశగా అభ్యర్థుల పోటీ ఉంటుందని తెలిపింది. పవన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్, రూట్ మ్యాప్ త్వరలో ప్రకటించనున్నారు.


