Mobile Popup Ad
Mobile Popup Ad

అవమానం తట్టుకోలేకే భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్

కలం, స్పోర్ట్స్: ఇండియాతో వరుసగా ఓడిపోతున్న అవమానం తప్పించుకోవడానికే పాకిస్థాన్ ఈసారి మ్యాచ్‌ను బహిష్కరిస్తోందని మాజీ భారత బ్యాటర్ సదగొప్పన్ రమేష్ (Sadagoppan Ramesh) చురకలంటించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ పోరు జరగాల్సిన వేళ, ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ఫిబ్రవరి 15న శ్రీలంకలో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ అయ్యింది. అయితే పాకిస్థాన్ ప్రభుత్వం జట్టు టోర్నీలో పాల్గొంటుందని, కానీ ఇండియాతో మ్యాచ్ ఆడబోదని ప్రకటించింది.

ఈ నిర్ణయాన్ని రమేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తీవ్రంగా ప్రశ్నించారు. ఇండియా (India)తో ఎదురుపడే అవకాశం దక్కినా, మ్యాచ్‌కే దూరంగా ఉండటం భయానికి సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. గత వరల్డ్ కప్‌ల ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాల్సిన బదులు, మ్యాచ్‌ను తప్పించుకోవడమే పాకిస్థాన్ ఎంచుకుందని చెప్పారు.

వరల్డ్ కప్‌ల్లో ఈ రెండు జట్ల మధ్య పోరు ఎక్కువగా ఒకపక్షంగానే సాగిందని రమేష్ గుర్తు చేశారు. బహుళజాతీయ టోర్నీల్లో 16 మ్యాచ్‌ల్లో ఇండియా 15 విజయాలు సాధించగా, పాకిస్థాన్ ఒక్కసారి మాత్రమే గెలిచిందని తెలిపారు. ఇక ఐసీసీ ఈ విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రమేష్ సూచించారు. పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే వెంటనే రెండు పాయింట్లు కోల్పోయేలా చర్యలు ఉండాలన్నారు.

అమెరికా లేదా నెదర్లాండ్స్ చేతిలో ఓడితే పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. అలా జరిగితే అది పెద్ద డ్రామాగా మారుతుందని చెప్పారు. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్థాన్‌తో పాటు అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. ఇండియా ఫిబ్రవరి 7న అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ పరిణామాలపై ఐసీసీ ఎలా స్పందిస్తుందో, టోర్నీ ముందుకు ఎలా సాగుతుందో చూడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>