కలం, నల్లగొండ బ్యూరో : హైదరాబాద్ – విజయవాడ (Hyderabad – Vijayawada)జాతీయ రహదారిపై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని పొడిచిన నేపథ్యంలో మళ్లీ హైవేలపై అలజడి మొదలైంది. హైవేలు దారి దోపిడీ దొంగలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. గతంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బిహారీ గ్యాంగ్ ముఠా దారి దోపిడీలకు పాల్పడింది. వరుస దారి దోపిడీలతో వాహనదారులకు, స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అయితే, పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో గత కొంతకాలంగా బీహార్ గ్యాంగు ముఠా జాడలు హైవేలపై కనిపించకుండా పోయాయి.
మంగళవారం చిట్యాలలో లిఫ్ట్ ఇచ్చిన కార్ డ్రైవర్ ను కత్తితో పొడిచిన ఘటనతో హైవే ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగల భయం పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే హైవేపై దారి దోపిడీ ఘటన జరగడం వాహనదారులను మరింతగా ఆందోళన పరుస్తుంది. ఇదిలా ఉంటే.. లిఫ్ట్ ఇచ్చిన కారు డ్రైవర్ ను కత్తితో పొడిచిన నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. అయితే అతడు ఉద్దేశపూర్వకంగా చేశాడా..? లేక నేరాలకు పాల్పడడం ప్రవృత్తిగా మార్చుకున్నాడా… అన్నది తేలాల్సి ఉంది.


