కలం, నల్లగొండ: నల్లగొండ (Nalgonda) జిల్లాలో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కేతేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 7 లక్షల విలువైన 8 మోటార్ సైకిళ్లు, 4 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ రమేష్ వెల్లడించారు.
ఈ ముఠాలో ప్రధాన నిందితులు చండూరు (Chandur) మండలం హనుమాన్ నగర్కు చెందిన పగిళ్ల శివ కుమార్. నల్లగొండ కేపీఎం కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్కు చెందిన అలుగుల వంశీ కృష్ణ కెమెరామెన్గా పనిచేస్తున్నాడు. వీరితో పాటు మరో ఇద్దరు బాల నేరస్తులు కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధాన నిందితుడైన పగిళ్ల శివ కుమార్ గతంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక హత్య కేసులో నిందితుడిగా చర్లపల్లి జైలుకు వెళ్లాడు. అక్కడ అతనికి వంశీ కృష్ణతో పరిచయం ఏర్పడింది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరూ కలిసి బైక్ దొంగతనాల ముఠాను ఏర్పాటు చేశారు. కేతేపల్లి, నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల్, హైదరాబాద్లోని పెట్బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 8 బైక్లను దొంగిలించినట్లు పోలీసులు నిర్ధారించారు.
2025 డిసెంబర్ 30న ఏపీలోని కడప జిల్లాకు చెందిన పల్లెం నరసయ్య హైదరాబాద్ నుండి విజయవాడకు తన బైక్పై వెళ్తూ, రాత్రి 11 గంటల సమయంలో కేతేపల్లిలోని సాయి కృష్ణ హోటల్ వద్ద నిద్రపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు లేచి చూడగా బైక్ కనిపించలేదు. ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కొర్లపహాడ్ ఎక్స్ రోడ్ వద్ద కేతేపల్లి (Kethepally) ఎస్.ఐ, సిబ్బంది వాహనాల తనిఖీ చేస్తుండగా, రెండు బైక్లపై నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ దొంగతనాల కేసును చాకచక్యంగా ఛేదించిన శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, CCS సీఐ జితేందర్ రెడ్డి, ఎస్.ఐ విజయ్ కుమార్, కేతేపల్లి ఎస్.ఐ సతీష్, హెడ్ కానిస్టేబుల్ విష్ణు వర్ధనగిరి, కానిస్టేబుళ్లు వాహీద్, పుష్పగిరిలను అదనపు ఎస్పీ రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.

Read Also: మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తాం : మహేష్ గౌడ్
Follow Us On: Instagram


