కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే వెబ్సైట్లో నమోదు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాలను అప్డేట్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తిచేసిన అభ్యర్థులకే భవిష్యత్తులో వెలువడే నియామక నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసే అర్హత ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ఓటీఆర్ అప్డేట్ గడువును 2026 ఫిబ్రవరి 25 వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 9తో ముగియాల్సి ఉంది. అయితే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు సవరణలు కోరడంతో గడువును పొడిగించింది.
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణలో జరిగిన మార్పులు, వ్యక్తిగత, విద్యార్హత వివరాల్లో సవరణల కోసం అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ తెలిపింది. ఓటీఆర్ (OTR) నమోదు చేసిన వివరాలనే నియామక ప్రక్రియ మొత్తం కాలంలో ప్రాథమిక ఆధారంగా పరిగణిస్తామని, సరైన సమాచారం ఇవ్వడం కీలకమని పేర్కొంది. అన్ని వివరాలు కాకుండా, అదనపు విద్యార్హతలు, చిరునామా, నాన్–క్రీమీ లేయర్ వివరాలు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి కొన్ని విభాగాల్లో మాత్రమే మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. మిగతా వివరాలు మార్చడానికి వీలు ఉండదని టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది.
ప్రతి అభ్యర్థికి ఒకే ఒక్క ఓటీఆర్ ప్రొఫైల్ ఉండాలని, లెక్కకుమించి రిజిస్ట్రేషన్లు నిషేధమని కమిషన్ హెచ్చరించింది. నిర్ణీత గడువు లోపల ఓటీఆర్ వివరాలను అప్డేట్ చేయని అభ్యర్థులు భవిష్యత్తు నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయలేరని కూడా స్పష్టం చేసింది. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, గడువు ముగిసిన తర్వాత ఎలాంటి సవరణలు లేదా పొడిగింపులు ఉండవని కమిషన్ (TGPSC) తేల్చిచెప్పింది.
Read Also: ట్రేడ్ డీల్తో రైతుల కష్టం అమెరికాకు తాకట్టు : రాహుల్
Follow Us On: Instagram


