కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో రసాయనాలు వాడటం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం మహాపరాధం చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మండిపడ్డారు. సోమవారం జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిట్ నివేదికలోని అంశాలను వక్రీకరిస్తూ వైసీపీ విష ప్రచారం చేస్తోందని అన్నారు. లడ్డూలో జంతు కొవ్వు లేదని ఆ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని ఆయన తెలిపారు.
ప్రసాదంలో వాడిన నెయ్యి అసలు నెయ్యే కాదని, మార్కెట్లో కిలో నువ్వుల నూనె రూ.400కి కూడా దొరకని పరిస్థితుల్లో, ఆ ధరకే ఆవు నెయ్యి ఎలా సరఫరా చేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన తెలిపారు. వైసీపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలే వారిపై దాడులకు కారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జనసేన కమిటీల్లో మహిళలకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ‘జెన్ జి డే’గా నిర్వహించనున్నట్లు పవన్ (Pawan Kalyan) తెలిపారు.



