కలం, వెబ్డెస్క్: ప్రపంచ ఆర్థిక వృద్ధిపై స్పేస్ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆసక్తికర ట్వీట్ చేశాడు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాల ఆధారంగా విడుదల చేసిన ఓ చార్ట్ను తన ట్వీట్కు ఆయన జత చేశారు. ఈ చార్ట్లో ఏముందంటే.. 2026లో ప్రపంచ జీడీపీ వృద్ధిలో అధిక వాటా పంచుకోబోయే 10 దేశాల పేర్లు ఉన్నాయి.
జాబితాలో మొదటి రెండు స్థానాల్లో చైనా, భారత్ ఉండగా అమెరికా థర్డ్ ప్లేస్లో నిలిచింది. చైనా 26.6శాతం వాటాతో టాప్లో ఉండగా, ఇండియా 17శాతంతో సెకండ్ ప్లేస్లో ఉంది. అమెరికా 9.9శాతంతో థర్డ్ ప్లేస్లో నిలిచింది. మిగిలిన స్థానాల్లో వరుసగా ఇండోనేషియా(3.8%), తుర్కియే(2.2%), నైజీరియా(1.5%), బ్రెజిల్(1.5%), వియత్నాం(1.6%), సౌదీ అరేబియా(1.7%), జర్మనీ(0.9%)తో ఉన్నాయి. అలాగే చైనా, భారత్ కలసి 43.6శాతం; ఆసియా–పసిఫిక్ వాటా 50శాతం ఉన్నట్లు చార్ట్లో ఉంది.
ఈ చార్ట్ను తన ట్వీట్కు జతచేసిన మస్క్ దానిపైన ‘ది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ ఛేంజింగ్’ అని రాశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో అధిక వాటా, అధికార కేంద్రం మారుతోందనే అర్థంలో మస్క్ ట్వీట్ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఇటీవల కొంతకాలంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత; వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం; చైనా, భారత్ను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ ఎడాపెడా సుంకాలు విధించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గ్లోబల్ ఎకనమిక్ పవర్ మారుతోందనే దానికి సంకేతంగా ఐఎంఎఫ్ అంచనాలు ఉన్నాయని మస్క్ (Elon Musk) పేర్కొనడం ఆసక్తి కలిగిస్తోంది. ఇది పరోక్షంగా ట్రంప్ విధానాలను మస్క్ విమర్శిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ట్రంప్కు మద్దతు తెలిపిన మస్క్, అనంతరం విభేదాల కారణంగా పరస్పరం విమర్శించుకుంటున్న సంగతి తెలిసిందే.
కాగా, మస్క్ ట్వీట్లోని ఛార్ట్లో పేర్కొన్న గ్రోత్ రేట్లో భారత్.. అమెరికాను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలవడంపై ఎన్డీఏ అనుకూల నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Read Also: ముగిసిన మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ
Follow Us On: X(Twitter)


