కలం, వెబ్డెస్క్: భారత్, ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి సంయుక్త ప్రకటన వెల్లడించే సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఒప్పందం గురించి మాట్లాడుతూ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా కోస్టా (Antonio Costa) ఓ కార్డు తీసి చూపించారు. అది విదేశాల్లో నివసించే భారత పౌరులకు ఇండియా ఇచ్చే ఓసీఐ కార్డు. అది చూసి ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్డర్ లేయెన్ చిరునవ్వులు చిందించగా, మిగిలినవాళ్లు ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఆ కార్డు వెనక ఉన్న అసలు సంగతిని కోస్టా వెల్లడించారు. తన మూలాలు భారత్లో ఉన్నాయని సగర్వంగా ప్రకటించారు.
‘నేను యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ని. అంతేకాదు, ప్రవాస భారతీయుడిని’ అని భావోద్వేగంతో చెబుతూ, కోస్టా తన జేబులోంచి ఓసీఐ కార్డు తీసి చూపించారు. ‘ఇది నాకెంతో ప్రత్యేకం. నా మూలాలు భారత్లోని గోవాలో ఉన్నాయని చెప్పేందుకు గర్వంగా భావిస్తున్నా. ఇక్కడి నుంచే మా కుటుంబం యూరప్తో సంబంధం కలిగి ఉంది. ఇది వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రత్యేకం’ అని కోస్టా అన్నారు.
గోవాలో ఇప్పటికీ ఇల్లు..
భారత్లోని గోవా ఒకప్పుడు పోర్చుగీసు కాలనీగా ఉండేది. ఆ సమయంలో ఆంటోనియో కోస్టా తాత గోవాలోని మార్గోవాలో పుట్టారు. అక్కడే తన జీవిత కాలంలో ఎక్కువ భాగం గడిపారు. అతని కుమారుడే ఓర్లాండో కోస్టా. ఈయన ప్రసిద్ధ రచయిత. ఆయన రచనల్లో ఎక్కువగా భారతీయ సంగతులు కనిపించేవి. గోవా భారత్లో కలవడంతో, 18 ఏళ్ల వయసులో ఓర్లాండో తన స్వదేశమైన పోర్చుగల్ రాజధాని లిస్బన్కు వెళ్లారు. అక్కడ పెళ్లి అనంతరం ఆయనకు ఆంటోనియో కోస్టా పుట్టారు. ఈ విషయాలను కోస్టా గుర్తుచేసుకున్నారు. కొంకణ్ ప్రాంతంలో భాగమైన గోవాలో చిన్నపిల్లలను పిలిచే ‘బబుష్’ పదంతో చిన్నప్పుడు తనను తల్లిదండ్రులు పిలిచేవాళ్లని చెప్పారు.
ఆంటోనియో కోస్టా పూర్వీకులు నివసించిన 200 ఏళ్ల నాటి పురాతన ఇల్లు ఇప్పటికీ మార్గోవాలోని అబేడ్ ఫరియా రోడ్లో ఉంది. పోర్చుగల్ ప్రధాని హోదాలో 2017లో ఒకసారి గోవాకు వచ్చిన ఆంటోనియో కోస్టా తన పూర్వీకుల ఇంటిని సందర్శించారు.
64 ఏళ్ల ఆంటోనియో కోస్టా (Antonio Costa) మృదు స్వభావి. మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రభావితమైన వ్యక్తి. అందుకే ఆయన్ని స్వదేశంలో ‘గాంధీ ఆఫ్ లిస్బన్’ అని పిలుస్తారు. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం 2014 నుంచి 2019 వరకు పోర్చుగల్ ప్రధానిగా పనిచేశారు. అనంతరం యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయ్యారు. ప్రస్తుతం బెల్జియం రాజధాని బ్రస్పెల్స్లోని యూరోపియన్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు.
Read Also: యాసిడ్ దాడి నిందితుల ఆస్తుల జప్తు.. బాధితులకు పరిహారం: సుప్రీంకోర్టు
Follow Us On : WhatsApp


