కలం, ఖమ్మం బ్యూరో: భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి, యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి (Ponguleti) శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ‘ధరణి’ ద్వారా సృష్టించిన చిక్కుముడులను విప్పుతూ.. రైతులకు చుట్టంలా ఉండేలా ‘భూభారతి’ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని ఆయన వెల్లడించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్లో ఐడీఓసీ శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
“గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్ల తేడాతో ఖచ్చితత్వం వచ్చేలా ‘రోవర్స్’ సాంకేతికతను వాడుతున్నాం. ఇప్పటికే 600 రోవర్లను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను మండలాలవారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించాం” అని వివరించారు. ఖమ్మం (Khammam) జిల్లాలో రెండో విడతలో అర్హత సాధించిన 47 మందికి నియామక పత్రాలు అందజేశామని, వీరంతా పారదర్శకతతో పనిచేయాలని సూచించారు.
ధరణిలో జరిగిన లోపాలపై ఇప్పటికే సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేశామని, ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు.


