epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కలెక్టర్లు, అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

కార్తిక మాసం(Karthika Masam) సందర్భంగా ఆలయాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతోంది. దీంతో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) సూచించారు. సోమవారం ఆయన కాకినాడ(Kakinada) జిల్లా కలెక్టర్‌, ఎస్పీతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్ మాట్లాడుతూ.. “భక్తులకు ఎక్కడా అసౌకర్యం తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, భద్రతాపరమైన చర్యల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం ఉండకూడదు” అని ఆదేశించారు.

ఇటీవలి కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేస్తూ, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలతోపాటు ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న ఆలయాల వివరాలను దేవాదాయశాఖ సేకరించి జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలోని సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాద గయ, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయాల్లో కార్తిక మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

ఈ నెల 5న కార్తిక పౌర్ణమి సందర్భంగా, అలాగే శని, ఆదివారాలు, సోమవారాల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలని పవన్‌ దిశానిర్దేశం చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణాల్లో క్యూలైన్ల నిర్వహణ, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పారిశుద్ధ్య పరిరక్షణ కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థలను ఆదేశించారు.

అలాగే భక్తుల రాకపోకలకు అనుగుణంగా ఏపీఎస్‌ ఆర్టీసీ అదనపు బస్సులు నడపాలని, రద్దీ సమయాల్లో జాతీయ రహదారులపై వాహన రాకపోకలను క్రమబద్ధీకరించాలని తెలిపారు. ప్రమాదాలకు తావులేకుండా ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు తీసుకోవాలని, రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆలయాల వద్ద తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) ఆదేశాలతో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్య ఆలయాల పరిసరాల్లో భక్తుల భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం సంబంధిత శాఖలు సన్నాహక పనులను వేగవంతం చేశాయి.

Read Also: భారత మహిళా జట్టుపై మోడీ పొగడ్తలు

Follow Us On : Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>