కలం, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య సంచలనం రేపుతోంది. ఈ సారి కారుతో తొక్కించి మరీ చంపేశారు కొందరు. బంగ్లాదేశ్ (Bangladesh) లోని రాజ్ బరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజ్ బరిలోని గోలంద్ మోర్ కు సమీపంలో ఉండే కరీం ఫిల్లింగ్ స్టేషన్ లో శుక్రవారం ఉదయం బీఎన్ పీ మాజీ నేత అబుల్ హషేమ్ తో పాటు కొందరు కారులో వచ్చి 3వేల పెట్రోల్ పోయించుకున్నారు. అక్కడే పనిచేస్తున్న 30 ఏళ్ల రిపన్ సాహా వాళ్లను డబ్బులు అడిగాడు. కానీ వాళ్లు ఇవ్వకుండా వెళ్లిపోవాలని చూశారు. దీంతో రిపన్ సాహా వారి కారుకు ఎదురుగా వెళ్లి నిల్చున్నాడు.
కారులో ఉన్న వారు కనికరం లేకుండా రిపన్ సాహా మీదుగా ఎక్కించారు. కారుతో తొక్కించి అక్కడి నుంచి పారిపోయారు. రిపన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన ఘటన సీసీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఈ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికి బంగ్లాదేశ్ లో పది మంది దాకా హిందువులు హత్యకు గురయ్యారు. బంగ్లాదేశ్ (Bangladesh) లో పరిస్థితులపై ఇప్పటికే భారత్ సీరియస్ గా స్పందించింది. మైనార్టీల భద్రత కోసం మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించినా.. అక్కడ హిందువుల హత్య ఆగట్లేదు.


