కలం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్రమోడీ (Modi) గుజరాత్ పర్యటన కొనసాగుతోంది. ఆదివారం ఆయన సోమనాథ్లోని ప్రసిద్ధ మహాదేవుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రార్థనలు చేశారు. ఉదయం సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్లో భాగంగా నిర్వహించిన శౌర్యయాత్రలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. విదేశీ దురాక్రమణదారుల నుంచి సోమనాథ్ ఆలయాన్ని కాపాడేందుకు పోరాడి ప్రాణత్యాగం చేసిన వీర యోధుల స్మృతిగా ఈ శౌర్యయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ ఆ వీరులకు నివాళులు అర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. శౌర్యయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
యాత్ర జరుగుతున్నంతసేపు భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఈ యాత్రలో ప్రత్యేకంగా తీసుకువచ్చిన 108 అశ్వాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆలయం వైపు వెళ్తున్న ప్రధానికి అవి ఎస్కార్ట్లా ముందుకు సాగిన దృశ్యం ప్రత్యేకంగా కనిపించింది. అనంతరం సోమనాథ్ మహాదేవుడి ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, ఈ కార్యక్రమం భక్తులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

Read Also: ఇక యూపీఎస్సీ పరీక్షల్లో ఫేస్ రికిగ్నీషన్!
Follow Us On : WhatsApp


