కలం, వెబ్డెస్క్: పాకిస్థాన్ (Pakistan) లోని పంజాబ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో పలువురు యూనివర్సిటీ క్రీడాకారులు ఉన్నారు. 20 మంది తీవ్రంగా గాయపడగా, వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీకి చెందిన క్రీడాకారులు లాహోర్ (Lahore) లో జరిగే క్రీడల్లో పాల్గొనడానికి బస్సులో బయల్దేరారు.
జాంగ్ జిల్లాలోని అడ్డా ఫఖీర్ ది కులీ ప్రాంతంలోకి వచ్చేసరికి వీరి బస్సు ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి, ఎదురుగా వస్తున్న వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోని 9 మంది అక్కడిక్కడే మరణించగా, ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. వాహనాలు రెండూ మితిమీరిన వేగంతో రావడం వల్లే ఈ రోడ్డు యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: రూ.900 కోట్ల విలువైన షేర్లు విరాళమిచ్చిన ఎలన్ మస్క్
Follow Us On: Instagram


