కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కొనసాగుతున్న నీటి వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. నీటి కేటాయింపులపై కేసీఆర్ చేసిన సంతకం తెలంగాణ కొంప ముంచిందని ఆయన విమర్శించారు. గురువారం ప్రజాభవన్ కృష్ణా, గోదావరి బేసిన్ అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటెషన్ ఇచ్చాడు. దీనికి సీఎం హాజరై అనంతరం మాట్లాడారు. ప్రెస్ మీట్లు పెట్టి పక్క రాష్ట్రాన్ని విమర్శించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. కేసీఆర్, హరీశ్, గులాబీ లీడర్ల మాటలను చూసిన తర్వాత వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్, చంద్రబాబు సీఎంలు అయ్యాకా నీటి అంశాలపై చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. కృష్ణా నికర జలాలకు సంబంధించి ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపు జరిగిందన్నారు. అందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, రెండు రాష్ట్రాల సీఎంల చర్చలలో 34:66 నిష్పత్తికి కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారన్నారు. తొలుత ఒక సంవత్సరానికి అని చెప్పి ఆ తర్వాత వరుసగా పొడిగిస్తూ 2020లో ట్రిబ్యునల్ ఫైనల్ చేసేంతవరకూ ఇదే ఫార్ములా ఉంటుందని కేసీఆర్ సంతకం చేశారని చెప్పారు. దీంతో శాశ్వతంగా తెలంగాణకు నష్టం వాటిల్లిందన్నారు.
2004లో ఏర్పడిన బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణకు సంబంధించి తీర్పు 2026 వచ్చినా రాలేదని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒప్పందంతో ఏపీకి మంచి అవకాశంగా కలిసొచ్చినట్లయిందని.. దీంతో ఈ నీటిపై ఆధారపడి ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నారని వెల్లడించారు. ఇలాంటి అడ్వాంటేజ్ కలిగిన తర్వాత జల వివాదాల్లో ఏపీ ఒక మెట్టు ఎందుకు దిగుతుందనేది కీలక అంశంగా ఉందని ప్రశ్నించారు. పరివాహక ప్రాంతం ఎంత ఉంటుందో అంత మేరకు నీట వాటా దక్కాలన్నది అంతర్జాతీయ సూత్రం అని చెప్పారు. దీని ఆధారంగా తెలంగాణకు 555 టీఎంసీలు (71%) కావాలని చెప్పామన్నారు. 1005 టీఎంసీల కేటాయింపు వివాదం సుప్రీం కోర్టులో నడుస్తున్నదని ఈ వివాదానికి సంబంధించి 19.11.2025న చంద్రబాబుకు జగన్ లేఖ రాశాడని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు.
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలల్లో ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని.. వరుస ఓటములతో ఆ పార్టీ మనుగడ కష్టమవుతోందని కేసీఆర్ గుర్తించారని చెప్పారు. ఈ కారణంగా మళ్లీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో జలవివాదాలు సృష్టించి పార్టీని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: బిగ్ బ్రేకింగ్: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత
Follow Us On: Sharechat


