కలం, మక్తల్: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మక్తల్ పట్టణంలో త్వరలో జరిగే నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, నారాయణపేట జిల్లా ఎస్పీ డా.వినీత్ (SP Vineeth) అన్నారు. గురువారం మక్తల్ పట్టణంలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. గణేష్ మండపాల వద్ద నుంచి మినీ ట్యాంక్ బండ్ వరకు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్, పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జనం సమయంలో పెద్ద చెరువు వద్ద నిర్వాహకులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు జరగొద్దని ఎస్పీ వినీత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి, యాదవ నగర్లో వినాయకుడిని దర్శించుకున్న ఎస్పీ పూజలు నిర్వహించారు. అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, ఆర్ఐ విజయభాస్కర్, ఎస్ఐలు రాజు, భాగ్యలక్ష్మి రెడ్డి ఉన్నారు.

