కలం, జోగులాంబ గద్వాల: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హన్మంతు నాయుడు (Basu Hanumanthu Naidu) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ సోమవారం కేటీదొడ్డి (KT Doddi) మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కరుణాకర్కు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాసు హన్మంతు నాయుడు మాట్లాడుతూ.. రైతుల పంట పొలాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించారు. సాగునీటి ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు, యూరియా కొరత, రైతు బీమా తదితర అంశాలపై రైతు సదస్సులు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు.
ఆరు గ్యారంటీలపై విమర్శలు
ఆరు గ్యారంటీల (Six Guarantees) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బాసు హన్మంతు నాయుడు ఆరోపించారు. ముఖ్యంగా యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ రైతుల కష్టాలను మరింత పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ తరఫున నిరంతరం ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జి. రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాస్గౌడ్, సోమశేఖర్రెడ్డి, చక్రధర్రెడ్డి, మున్నూరు వీరారెడ్డి, గాజుల కృష్ణారెడ్డి, నక్క రవి తదితరులు పాల్గొన్నారు.
Also Read : కీయా 140 కేజీల లిఫ్ట్ వైరల్.. ఆ తర్వాత ఏఐ వేధింపులు!
Follow Us On : WhatsApp

