కలం, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధర్మపురి పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ (Adluri Laxman) ఒక ప్రకటనలో కోరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పర్యటిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ధర్మపురి చేరుకుంటారని మంత్రి తెలిపారు. ధర్మపురి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి గార్డెన్స్ లో నిర్వహించే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి వివరించారు.
ఆదివారం రాత్రి ధర్మపురిలో బస చేసి సోమవారం తెల్లవారు జామున 2గంటల 30నిముషాలకు ధర్మపురిలో రూ.10కోట్లతో ఉగ్ర నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులను భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని మంత్రి లక్ష్మణ్ తెలిపారు. ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పూజ అనంతరం ఉప ముఖ్యమంత్రి సోమవారం ఉదయం 5 గంటల 30 నిముషాలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని పేర్కొన్నారు. భట్టి పర్యటనను ధర్మపురి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

