కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ ప్రముఖ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేరు మార్పుపై వస్తున్న పుకార్లకు కొత్త యాజమాన్యం తెరదించింది. జట్టు పేరులో ఎలాంటి మార్పు ఉండదని, ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’గానే కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చింది. 2026 మార్చిలో ఆర్సీబీ యాజమాన్య బాధ్యతలను ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్స్టోన్ సంస్థల కన్సార్టియం దక్కించుకుంది. సుమారు $1.78 బిలియన్ల (రూ. 16,706 కోట్లు) భారీ ధరకు పురుషుల, మహిళల జట్లను ఈ గ్రూప్ కొనుగోలు చేసింది. అనంతరం ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ బిర్లా ఆర్సీబీ ఛైర్మన్గా, సత్యన్ గజ్వానీ వైస్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లడంతో ఆర్సీబీ పేరు మారుతుందనే ప్రచారం జరిగింది. అయితే ఆర్యమన్ బిర్లా ఈ పుకార్లను ఖండించారు. ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ అనేది ఒక శక్తివంతమైన బ్రాండ్ అని, ఆ పేరును మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేవలం రెండు నెలల ఐపీఎల్ టోర్నీకే పరిమితం కాకుండా, ఏడాది పొడవునా అభిమానులతో అనుబంధాన్ని పెంచుకునేలా ఆర్సీబీ బ్రాండ్ను విస్తరిస్తామని చెప్పారు. క్రికెట్తో పాటు ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయాన్ని 30 శాతం నుంచి 50 శాతానికి పెంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఆర్సీబీకి ఇటు పురుషులు, అటు మహిళల విభాగాల్లో వరుస విజయాలు లభించాయి. 2025లో పురుషుల జట్టు మొదటి ఐపీఎల్ ట్రోఫీ గెలవగా, 2026లో మహిళల జట్టు రెండో డబ్ల్యూపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ జట్టుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ బ్రాండ్ విలువను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

