కలం, మెదక్ బ్యూరో : తప్పు చేసినందుకు కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన తరహాలోనే, సెక్షన్ 22-A భూముల వ్యవహారంలో తప్పు జరిగిందని అంగీకరించిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని ఎంపీ రఘనందన్ రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ‘సింఫోని పార్క్ హోమ్స్’ కాలనీలో 22-A నిబంధనల కింద భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై కాలనీ ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..సెక్షన్ 22-A వల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, బాధితుల నుంచి ఎలాంటి దరఖాస్తులు కోరకుండానే ప్రభుత్వం నేరుగా ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి అన్ని అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టడం దారుణమని, బాధితుల తరఫున బిజెపి పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు.

