కలం, ఖమ్మం బ్యూరో: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందిగా మారిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ శనివారం కొత్తగూడెం (Kothagudem), జిల్లా కేంద్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన భారీ పాదయాత్ర నిర్వహించారు.
మార్కెట్ నుంచి సూపర్ బజార్ వరకు సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ విద్యార్థి శక్తులు ఉద్యమిస్తే ఎంతటి ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని అన్నారు. గతంలో నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేయడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించిందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వద్దిరాజు (MP Vaddiraju) ఆరోపించారు. 33 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కదానినీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలోని 1,050 గురుకులాలను కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మూడు ప్రధాన డిమాండ్లు
పాలిటెక్నిక్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న జీవో 97ను ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న రూ.13 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వద్దిరాజు కోరారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీలో సుమారు 3 వేల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Also Read : బీజేపీ చెత్త కుప్ప కాదు: మురళీధర్ రావు
Follow Us On: Instagram

