కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులపై ఎటువంటి చర్చలు జరగలేదని ఆయన చెప్పారు. ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిగిన భేటీలో కేవలం కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపై మాత్రమే సుదీర్ఘంగా చర్చలు జరిగాయని వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడుతారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం అనేది పూర్తిగా ఏఐసీసీ (AICC) తీసుకున్న నిర్ణయమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అధిష్ఠానం ఈ చర్యలకు పూనుకుందని తెలిపారు. సురేఖ తొలగింపును ఆపేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనపై AICC చాలా సీరియస్గా ఉందని పేర్కొన్నారు. మీడియా చిట్ చాట్ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

