కలం, వనపర్తి: ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్ఎస్వీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో వనపర్తి (Wanaparthy) లో విద్యార్థులతో నిరసన ర్యాలీ (BRSV Protest) నిర్వహించారు.
ఈ సందర్భంగా హేమంత్ ముదిరాజ్ (Hemanth Mudiraj) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, యూత్ కమిషన్, రూ.10 లక్షల వడ్డీలేని రుణాల వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విదేశీ విద్యకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న GO 97ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. యూత్ డిక్లరేషన్లో పేర్కొన్న హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్వీ వనపర్తి ఇన్చార్జి సూర్యవంశం గిరి, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి సునీల్ వాల్మీకి, శివగౌడ్, సిరివాటి శంకర్, జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేష్గౌడ్, ప్రేమనాథ్రెడ్డి, చిట్యాల రాము, గాలిగల్ల క్రాంతికుమార్, జీవీ ప్రసాద్, విజయ్మోహన్, అలీమ్, జోయబ్ హుస్సేన్, యుగంధర్రెడ్డి, లక్ష్మణ్గౌడ్, నాగరాజ్, బేధడి కుమార్, ఇమ్రాన్, మునికుమార్, అస్లాం, అఖిలేందర్, చంద్రశేఖర్, మంద రాము, రవి, సంతోష్తో పాటు పలువురు నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, యువజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

