కలం, వెబ్డెస్క్: కొండా సురేఖ (Konda Surekha) మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు. మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత తొలిసారి ఫేస్బుక్లో సంచలన పోస్ట్ చేశారు. ఇక నిరీక్షణ ముగిసిందని, త్వరలో బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నానని ప్రకటించారు. తన పోస్ట్ చివరలో స్టే ట్యూన్డ్ తెలంగాణ అని రాసుకొచ్చారు. దీంతో అసలు కొండా సురేఖ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కొండా సురేఖ ఈ పోస్టును తన అధికారిక ఎక్స్ ఖాతాలో మాత్రం పోస్ట్ చేయలేదు.
మరోవైపు కొండా సురేఖ శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా చేసిన పోస్టు కూడా ఆసక్తికర చర్చకు తెర లేపింది. గతంలో ఆమె తన పోస్టులు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ పెద్దల ఫోటోలతో చేసేవారు. కానీ, నేటి కృష్ణాష్టమి పోస్టులో మాత్రం కేవలం ఆమె ఫోటోతో మాత్రమే పోస్టు చేశారు. అలాగే పోస్టు కింద కొండా సురేఖ అని ఆమె పేరు మాత్రమే పెట్టుకున్నారు. గతంలో ఆమె మంత్రిత్వ శాఖను జోడించి పోస్టు పెట్టుకునే వారు. ఇప్పుడు అటు కాంగ్రెస్ పెద్దల ఫోటోలు లేకుండా, తాను ఎమ్మెల్యే అని కూడా మెన్షన్ చేయకుండా పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి నుంచి తప్పించడంతో కొండా సురేఖ పార్టీ నుంచి బయటకు వెళ్తారని, వేరే పార్టీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇక పార్టీ పెద్దల ఫోటోలు లేని తాజా పోస్టు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

