కలం, వెబ్ డెస్క్ : నేవీ ముంబై నుంచి శ్రీనగర్ ఎయిర్పోర్టు (Srinagar Airport) చేరుకున్న ఇండిగో విమానం 6E 225 (VT-NOG) కి శుక్రవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ల్యాండింగ్ పూర్తయిన తర్వాత పార్కింగ్ ఏరియాలోని బే నంబర్ 6 లో ప్లేన్ను పార్క్ చేస్తున్న సమయంలో అది ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. విమానం ఢీకొట్టిన ఆ పోల్ విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) లో భాగమని, ఇది విమానాలను సురక్షితంగా పార్క్ చేయడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.
ఉదయం 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను, విమాన సిబ్బందిని మ్యాన్యువల్ ఎయిర్క్రాఫ్ట్ మెట్ల సహాయంతో కిందకు దించి సురక్షితంగా టెర్మినల్కు తరలించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీనగర్ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయని, మిగతా విమానాల రాకపోకలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని విమానాశ్రయ వర్గాలు ధృవీకరించాయి.

