కలం, వెబ్డెస్క్: గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హామీ ఇచ్చారు. నేడు మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి పొన్నంతో పలువురు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. వీరిలో ఆటో, క్యాబ్, యాప్ ఆధారిత రవాణా రంగానికి సంబంధించిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 2012 తర్వాత మొదటిసారి ఆటో చార్జీల పెంపుపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
గిగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ను త్వరితగతిన అమలు చేయాలని వారు కోరినట్లు తెలిపారు. అలాగే యాప్ ఆధారిత రవాణా రంగంలో పని చేస్తున్న ఆటో, క్యాబ్, సరుకుల రవాణా వాహనాల డ్రైవర్లకు న్యాయం జరిగేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. కనీస బేస్ చార్జీ, కిలోమీటరు చార్జి, లేట్ చార్జీలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. వారి సమస్యలు ఓపికగా విని త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

