కలం, కరీంనగర్ బ్యూరో: పేదల ఆకలి తీర్చాల్సిన రూపాయి కిలో బియ్యాన్ని దారి మళ్లించి, అక్రమార్కులు కోట్లు కొల్లగొడుతున్న దందాను అధికారులు మంగళం పాడారు. హుజూరాబాద్ (Huzurabad) మండలం రాంపూర్ సరిహద్దుల్లోని ‘తిరుమల ఇండస్ట్రీస్’ (Thirumala Industries) రైస్ మిల్లుపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకే సివిల్ సప్లైస్ టాస్క్ఫోర్స్, రెవెన్యూ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు 340 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంధువుల ముసుగులో బడా దందా
మిల్లు యజమాని ఉపేందర్ తన సమీప బంధువైన శీల శ్రీను అనే వ్యాపారితో కలిసి ఈ అక్రమ సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్ ప్రాంతాల్లోని రేషన్ డీలర్లు స్థానిక ఏజెంట్లతో చేతులు కలిపి తక్కువ ధరకు బియ్యం సేకరిస్తున్నారు. ఉదాహరణకు ఇప్పల నరసింగాపూర్ డీలర్ నుంచి కూడా బియ్యం సేకరించినట్లు పట్టుబడిన డ్రైవర్ తిరుపతి సురేష్ ఒప్పుకున్నాడు.
రీసైక్లింగ్ మాయాజాలం
సేకరించిన రేషన్ బియ్యాన్ని సదరు తిరుమల ఇండస్ట్రీస్ (Thirumala Industries) రైస్ మిల్లులో రీసైక్లింగ్ (పాలిష్) చేసి, ప్రభుత్వం నుంచి వచ్చే కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోటా కింద తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తూ రెంటికీ చెల్లెలా మోసానికి పాల్పడుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు.
పరదాల చాటున సరఫరా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ట్రాలీలు
ఎవరికీ అనుమానం రాకుండా పరదాలు కప్పి లోడు తరలిస్తుండగా 50 క్వింటాళ్ల బియ్యంతో ఉన్న రెండు ట్రాలీలను అధికారులు రెడ్ హ్యాండెడ్గా స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ డ్రైవర్లు తిరుపతి సురేష్, అంగిడి తిరుపతిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిల్లు యజమాని ఉపేందర్, ప్రధాన సూత్రధారి శీల శ్రీనుతో పాటు ఇందులో ప్రమేయమున్న డీలర్లపై కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. లోతుగా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
Also Read : కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమర శంఖం: నిరసనలకు పువ్వాడ పిలుపు!
Follow Us On: X(Twitter)

