కలం, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ వద్ద సరైన రోడ్డు సౌకర్యం లేక స్థానిక ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తీగలగుట్టపల్లి రైల్వే గేట్ నుండి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, రోడ్డు సౌకర్యం సరిగా లేక ముఖ్యంగా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు.
రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి..
ప్రజల సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో మేయర్ సంబంధిత ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధుల కొరత ఉందని ఆర్అండ్బీ అధికారులు మేయర్కు తెలియజేయడంతో ప్రజలు మరింత కాలం ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గంలో సమస్యను పరిష్కరించాలని మేయర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా మున్సిపల్ సాధారణ నిధులు (MGF) నుంచి రూ.33 లక్షలు కేటాయించి తారు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా తీగలగుట్టపల్లి రైల్వే గేట్ (ROB) వద్ద రూ.33 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న తారు రోడ్డు పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
రూ.150 కోట్ల నిధులు మంజూరు చేయించారు..
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో సేతుబంధన్ స్కీం కింద ఆర్ఓబీ నిర్మాణానికి దాదాపు రూ.150 కోట్ల నిధులు మంజూరు చేయించారని అన్నారు. ఆ నిధులతో చేపట్టిన ఆర్ఓబీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కరీంనగర్ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు బండి సంజయ్ కుమార్ కృషి చేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించడమే నగర పాలక సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
నగర పాలక సంస్థ కృషి చేస్తోంది..
ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు నగర పాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద తారు రోడ్డు నిర్మాణం పూర్తయితే రైల్వే స్టేషన్కు వచ్చే ప్రయాణికులతో పాటు స్థానిక ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. రోడ్డు నిర్మాణంతో ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగుపడి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మేయర్ అన్నారు. నగరంలోని ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి..
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ఎక్కడా రాజీ పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్ణయించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నగర పాలక సంస్థ వద్ద అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని మేయర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు సాదినేని లావణ్య మునిందర్, భారీ అపర్ణ జితేందర్, మున్సిపల్ అధికారులు, రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

