కలం, నిర్మల్: ఖానాపూర్ (Khanapur) మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలను స్వాధీనం చేసుకుని నిబంధనల మేరకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్కు స్పందించవద్దని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు రాహుల్ గైక్వాడ్, సాయి కుమార్, హన్మాండ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

