కలం, మునుగోడు: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలనుకుంటే మరో పెద్ద ఉద్యమానికి ప్రజలు సిద్ధమవుతారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి (Mudireddy Sudhakar Reddy) హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా 2000 ఆగస్టు 28న బషీర్బాగ్లో జరిగిన ఆందోళనల్లో పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్రెడ్డికి శుక్రవారం నివాళులర్పించారు. నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. అప్పుడు ప్రజలు సాగించిన పోరాటం ఫలితంగానే నేటికీ ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచే సాహసం చేయలేకపోతున్నాయని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ వంటి నిర్ణయాలు ప్రజా ఉద్యమాల ఫలితమేనని అన్నారు. ఆనాటి పోరాటంలో ముగ్గురు అమరులైనా.. విద్యుత్ రంగంలో ప్రజల హక్కుల పరిరక్షణకు వారి త్యాగాలు స్ఫూర్తిగా నిలిచాయని పేర్కొన్నారు.
విద్యుత్ రంగంపై కేంద్రం నియంత్రణ..
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని సుధాకర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ రంగంపై కేంద్రం మరింత నియంత్రణ సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సబ్సిడీలను పరిమితం చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో సామాన్యులు, రైతులపై భార పడే ప్రమాదం ఉందన్నారు.
పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండీ.సలీం మాట్లాడుతూ.. ప్రజా పోరాటాల కారణంగానే 26 ఏళ్లుగా విద్యుత్ ఛార్జీలు నియంత్రణలో ఉన్నాయని అన్నారు. నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో రెండు విభాగాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా నాయకులు సయ్యద్ హాషీం, పుచ్చకాయ నర్సిరెడ్డి, రాచమల్ల వెంకట్ రెడ్డి, గిరిబాబు, సాదక్కలి, పంచలింగం, పుష్పలత పాల్గొన్నారు.

