కలం, స్పోర్ట్స్: యువత డిజిటల్ తెరలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ప్లేస్టేషన్ల కంటే ఆటల మైదానాలే ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన ‘ఖేలో ఇండియా సంవాద్’(Khelo India Samvaad) కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అథ్లెట్లతో ప్రధాని మాట్లాడారు. క్రీడలు కేవలం పాఠశాలల్లో అదనపు వ్యాపకం కాదని, ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ఆటలు భాగం కావాలని మోదీ ఆకాంక్షించారు. చదువు, కెరీర్ టైమ్టేబుల్లో క్రీడలకు చోటు కల్పించడం మంచి పరిణామమని అన్నారు. పాఠశాలలు, కుటుంబాలు క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే దేశంలో బలమైన క్రీడా సంస్కృతి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఆటలు గెలుపోటములను సమానంగా స్వీకరించే క్రీడా స్ఫూర్తిని నేర్పుతాయని ప్రధాని తెలిపారు. ఓటమి ఎదురైనా కిందపడిన చోటే ఆగిపోకుండా తిరిగి లేచి పోరాడే ధైర్యాన్ని క్రీడలు అందిస్తాయని అన్నారు. క్రీడలతో ఆరోగ్యకరమైన సమాజం, మెరుగైన కుటుంబ వ్యవస్థ, మంచి పని సంస్కృతి ఏర్పడతాయని వివరించారు. క్రీడల్లో విజయం అంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని మోదీ స్పష్టం చేశారు. అథ్లెట్ సాధించే విజయం వారి కుటుంబం, పాఠశాల, జిల్లా, రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను పెంచుతుందని పేర్కొన్నారు.

