కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల సుదీర్ఘ సాగునీటి కల నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. సీతారామ ప్రాజెక్టుకి అనుసంధానంగా నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల (Marellapadu Lift Irrigation) పథకం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 29న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘనంగా ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు.
బహిరంగ సభ ఏర్పాటు..
అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని తనిఖీ చేసి, అక్కడ జరుగుతున్న పనులపై కలెక్టర్, ఎమ్మెల్యేలఅధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం కాలువ, గొందిగూడెం – జి.కొత్తూరు పల్లె ప్రకృతి వనం సమీపంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభా స్థలి ఏర్పాట్ల తీరును సమీక్షించారు.
మంత్రుల పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా, కార్యక్రమానికి తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

