కలం, వెబ్డెస్క్: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తనపై అథ్లెట్ తక్కడపల్లి ప్రతిభ (Athlete Thakkadpally Pratibha) చేసిన ఆరోపణలపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రతిభ గత ప్రభుత్వంలో తనకు క్రీడా శాఖ మంత్రి నుంచి వేధింపులు ఎదురయ్యాయని అన్నారు. ఆయనకు స్వయంగా తానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్, బీజేపీలు విరుచుకుపడ్డాయి. బీఆర్ఎస్ హయాంలో క్రీడాకారిణుల దుస్థితి ఇదంటూ విమర్శలు గుప్పించాయి. దీంతో ఆయన స్వయంగా నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆరోపణలపై స్పందించారు.
గతంలో ప్రతిభకు ఎదురైన వేధింపులపై ఆమె బాబాయి తమను సంప్రదించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తన వద్ద పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ అసభ్యకర మెసేజ్లు పెట్టినట్లు గుర్తించి, సదరు వ్యక్తిని అప్పుడే ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు గుర్తు చేశారు. దీనిపై ప్రతిభ బంధువులు కూడా శ్రీనివాస్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు. తమకు ప్రభుత్వం తరఫున చేయాల్సినంత సాయం చేశారని ఎంతో సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ ఎందుకు తెరపైకి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎదుటి వ్యక్తిని డ్యామేజ్ చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు. తనకు ఈ ఇష్యూకి ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రతిభ ఓ ఇంటర్వ్యూలో పొరపాటున మాట్లాడిన చిన్న మాటలను పట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇష్టారీనితన వైరల్ చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్, బీజేపీలు వ్యక్తిత్వ హననం చేస్తున్నాయని ఆరోపించారు. ఇంటర్వ్యూలో ప్రతిభ మాట్లాడిన మాటలన్నింటిని పక్కన పెట్టి రెండు పార్టీలు తనపై వచ్చిన ఆరోపణలనే వైరల్ చేస్తున్నాయన్నారు. పార్టీ అధికారిక ఖాతాలో ఈ వ్యాఖ్యలు పోస్ట్ చేసి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం దారుణమన్నారు. ఈ వ్యవహారంలో రెండు పార్టీలపై లీగల్గా యాక్షన్ తీసకుంటామని స్పష్టం చేశారు.

