కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి(Kamareddy) రైల్వే స్టేషన్లో ఎక్సైజ్, రైల్వే టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న రైలులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఎక్సైజ్, రైల్వే టాస్క్ఫోర్స్ అధికారులు కామారెడ్డి రైల్వే స్టేషన్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని బ్యాగును తనిఖీ చేశారు. బ్యాగులో 2 కిలోల చొప్పున నాలుగు ప్యాకెట్లు, మరో కిలో ప్యాకెట్ ఉండగా మొత్తం 9 కిలోల ఎండు గంజాయి (9 Kg Ganja) లభ్యమైంది. పట్టుబడిన వ్యక్తిని మధ్యప్రదేశ్కు చెందిన కిషన్ పటేల్గా గుర్తించారు.
గంజాయిని తన స్నేహితుడికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు చెప్పినప్పటికీ, విక్రయించేందుకే తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ దాడుల్లో ఆర్పీఎఫ్ ఎస్సై జి. వెంకటేశ్వర్లు, ఏఎస్సై పి. రవీంద్రబాబు, సిబ్బంది బయ్యాలు, బాలా సాహెబ్, చంద్రశేఖర్, మీనాక్షి, శివాని, ఎక్సైజ్ ట్రైనీ ఎస్సైలు శ్రీనివాస్, మధు, అనిల్, రచనతో పాటు సిబ్బంది ఫరీద్, పవన్, బాబు, రాజు, దినేష్, రమ తదితరులు పాల్గొన్నారు.

