కలం, వెబ్డెస్క్: ప్రపంచకప్లో సెమీస్ చేరకుండానే భారత్ హాకీ టీమ్ (India Hockey Team) కథ ముగిసింది. అర్జెంటీనాతో 3-5 ఓటమి తర్వాత ఇప్పుడు అసలు సమస్యలపై చర్చ మొదలైంది. జట్టు మార్పు ప్రక్రియలో భారత్ వెనుకబడిందని మాజీ ఆటగాళ్లు విమర్శించారు. 51 ఏళ్లుగా పురుషుల హాకీ ప్రపంచకప్ టైటిల్ కోసం భారత్ ఎదురుచూస్తోంది. ఈసారి టైటిల్ వస్తుందని పెద్దగా అంచనాలు లేకపోయినా.. కనీసం సెమీస్కు చేరకపోవడం నిరాశ కలిగించింది. రెండేళ్లలో లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ ఉన్నాయి. కానీ జట్టులో అదే సీనియర్ ఆటగాళ్లపై ఆధారపడటం ఆందోళన కలిగిస్తోందని మాజీ గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ అన్నారు.
మన్మీత్ సింగ్, అమీర్ అలీ, రోషన్ కుజూర్, శార్దానంద్ తివారీ, తాలెమ్ ప్రియబర్త, రోహిత్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లకు తగిన అవకాశాలు రాలేదని ఆయన పేర్కొన్నారు. జూనియర్ ప్రపంచకప్లో ఆరు గోల్స్ చేసిన మన్మీత్ సింగ్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. 1980 మాస్కో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కెప్టెన్ వాసుదేవన్ భాస్కరన్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. జూనియర్ నుంచి సీనియర్ జట్టుకు ఆటగాళ్ల మార్పు సరిగ్గా జరగడం లేదని అన్నారు.
జర్మనీ, నెదర్లాండ్స్లో ఈ మార్పు సజావుగా జరుగుతోందని భాస్కరన్ పేర్కొన్నారు. గత రికార్డులు, సంఖ్యలు, ఇతర కారణాల ఆధారంగా ఎంపికలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రొ లీగ్లోనే కొంతమంది యువ ఆటగాళ్లను పరీక్షించాల్సిందని అన్నారు. జూనియర్ జట్టు నిపుణుల సేవలను కూడా సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. జూనియర్ ప్రపంచకప్లో పతకం సాధించిన జట్టుకు సంబంధించిన అనుభవాన్ని సీనియర్ జట్టు ఎందుకు ఉపయోగించుకోలేదనే అంశాన్ని ప్రస్తావించారు.
మాజీ ఆటగాడు జగ్బీర్ సింగ్ కూడా కొన్ని ఎంపిక నిర్ణయాలు మెరుగ్గా ఉండాల్సిందని అన్నారు. ఒలింపిక్స్ నుంచి తదుపరి ఒలింపిక్స్ వరకు జట్టు నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జట్టు ఆటలో నిలకడ లేకపోవడం మరో ప్రధాన సమస్యగా కనిపించింది. 60 నిమిషాల మ్యాచ్లో రక్షణ వ్యవస్థ తరచూ కుప్పకూలిందని జగ్బీర్ అభిప్రాయపడ్డారు. దాడిలోనూ భారత్ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. భారత ఫార్వర్డ్ లైన్లో గత నాలుగేళ్లుగా చెప్పుకోదగ్గ స్థిరమైన ప్రదర్శన కనిపించలేదని భాస్కరన్ అన్నారు.
ఫుల్ ప్రెస్కు వెళ్లినప్పుడు మిడ్ఫీల్డ్లో ఖాళీలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కెప్టెన్, డ్రాగ్-ఫ్లిక్ నిపుణుడు హర్మన్ప్రీత్ సింగ్పైనే ఎక్కువగా ఆధారపడటం కూడా సమస్యగా మారింది. ఆయన పూర్తిస్థాయి ఫిట్నెస్లో లేరు. మరోవైపు మన్ప్రీత్ సింగ్, మందీప్ సింగ్ వంటి అనుభవజ్ఞులు ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ రక్షణ పటిష్టతకు ప్రాధాన్యం ఇస్తున్నా.. ప్రపంచకప్లో భారత రక్షణే పెద్ద బలహీనతగా కనిపించింది.
బెంచ్ బలం లేకపోవడానికి దేశీయ హాకీ వ్యవస్థలో పోటీ తగ్గడమే కారణమని మాజీ కెప్టెన్ పర్గత్ సింగ్ అన్నారు. గతంలో ఉన్న పలు దేశీయ టోర్నీలు, పోటీ వాతావరణం తగ్గిపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నారు. సీనియర్లను మార్చాలంటే ఆ ప్రక్రియ రెండేళ్ల ముందే మొదలై ఉండాల్సిందని పర్గత్ సింగ్ అన్నారు. ప్రపంచ స్థాయి ఆటగాళ్లను తయారు చేయడానికి సమయం అవసరమని చెప్పారు. ఆసియా స్థాయిలో విజయాలను మాత్రమే చూసి భారత హాకీ పురోగతిని అంచనా వేయడం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
2024లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ, 2025లో ఆసియా కప్ను భారత్ గెలిచింది. అయితే ప్రపంచ స్థాయి జట్లపై అదే స్థిరత్వం కనిపించలేదు. ప్రొ లీగ్లోనూ భారత్ వరుసగా ఎనిమిదో స్థానంలోనే నిలిచింది. 2024-25, 2025-26 సీజన్లలో ఇదే పరిస్థితి. తాజా ప్రొ లీగ్లో మాత్రం యూరప్లో భారత్ మంచి పునరాగమనం చేసింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ, ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్పై విజయాలు సాధించింది. కానీ. ప్రపంచకప్లో మళ్లీ పాత సమస్యలే బయటపడ్డాయి. అర్జెంటీనాతో 3-5 ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు కోల్పోయింది. ఇప్పుడు ప్రపంచకప్లో తదుపరి స్థానాల కోసం జరిగే మ్యాచ్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

