కలం, వెబ్ డెస్క్: శ్రావణ మాసం వేళ బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే సోమవారంతో పోలిస్తే మంగళవారం బంగారం ధరలు (Gold Prices) స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,63,750కి చేరింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.200 పతనమై రూ.1,50,100గా పలుకుతోంది. వెండి ధరల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. కిలో వెండి రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది. గ్రాము వెండి రూ.260గా విక్రయమవుతోంది. ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నాయి.
ఇప్పట్లో తగ్గవా..?
బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవా..? అని కొనుగోలుదారులు నిత్యం ఆరా తీస్తున్నారు. శ్రావణం వేళ పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్లతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి రాబోయే రోజుల్లో భారీగా పతనమయ్యే అవకాశాలు చాలా తక్కువేనని బులియన్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. డాలర్ విలువ పెరుగుతుండటం, దేశీయంగా ద్రవ్యోల్బణం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటంతో బంగారం రేట్లు తగ్గే అవకాశం లేదు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు, చమురు రవాణాలో ఆటంకం కూడా పసిడి ధరలు భగ్గుమనేందుకు కారణమవుతున్నాయి.

