కలం, వెబ్డెస్క్: ముంబైలోని ఐటీసీ మరాఠా షెరాటన్లో జరుగుతున్న ఆసియా జూనియర్ చెస్ (Asian Junior Chess) ఛాంపియన్షిప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఏడో రౌండ్ ముగిసేసరికి భారత యువ క్రీడాకారులు తమ ప్రతిభతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. గర్ల్స్ కేటగిరీలో టాప్ సీడ్ ప్రతీతి బార్డోలోయ్ ఆద్య గౌడపై కీలక విజయం సాధించి, మొత్తం 6 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానానికి దూసుకెళ్లారు. దాంతో తన సమీప ప్రత్యర్థి కంటే అర పాయింట్ ముందంజలో నిలిచారు. ఇప్పటివరకు సంయుక్త లీడ్లో ఉన్న తుర్క్మెనిస్థాన్కు చెందిన షోహ్రాదోవా లేలా.. శివాంశికతో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి 5.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు.
ఇక ప్రిషితా గుప్తా.. నివేదితపై గెలిచి లేలాతో కలిసి 5.5 పాయింట్ల వద్ద నిలవగా, మరియా కొల్యావ్కో – దక్షిత కుమావత్ ల మధ్య గేమ్ డ్రాగా ముగియడంతో వారిద్దరూ 5 పాయింట్లకు చేరుకున్నారు. ఓపెన్ విభాగంలో కూడా టాప్ సీడ్ మయాంక్ చక్రవర్తి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. విఘ్నేష్ అద్వైత్ వేముల ఈ గేమ్ను డ్రాగా ముగించినప్పటికీ, 6 పాయింట్లతో మయాంక్ తన లీడ్ను కాపాడుకున్నారు. అలాగే అర్టెమ్ పింగిన్తో దక్ష్ గోయల్ గేమ్ను డ్రా చేసుకోగా, శరణార్ధి వీరేష్.. అమన్ముహమ్మద్పై గెలిచి 5.5 పాయింట్లకు చేరారు.
విఘ్నేష్, పింగిన్, వీరేష్లు మయాంక్కు గట్టి పోటీ ఇస్తున్నారు. అంతకుముందు జరిగిన రౌండ్లలో జైవీర్ మహేంద్రు.. ఆదిత్య ధింగ్రాపై సంచలన విజయం సాధించి టాప్ లీడర్గా నిలవగా, గురు ప్రకాష్ తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న మాధవేంద్ర ప్రతాప్ను డ్రాగా నిలువరించి ఆకట్టుకున్నారు. గర్ల్స్ విభాగం నాల్గో రౌండ్లో ప్రతీతి బార్డోలోయ్.. శివాంశికపై విజయం సాధించి, ప్రణవశ్రీని ఓడించిన లేలాతో కలిసి అప్పట్లో సంయుక్త ఆధిక్యం సాధించారు.

