కలం, ఖమ్మం బ్యూరో: ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు (Taliperu Project) వరద పోటెత్తుతోంది. బీజాపూర్, సుక్మా జిల్లాల్లో వర్షాలు పడుతుండటంతో జలాశయానికి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీనికితోడు స్థానిక చింత వాగు, రోటెంత వాగు, పగిడి వాగులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో తేగడ వద్ద తాలిపేరు నది ఉగ్రరూపం దాల్చి గోదావరి వైపు ఉరకలెత్తుతోంది.
ప్రస్తుతం ప్రాజెక్టు ఎగువ నుంచి దాదాపు 55 వేల క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో వస్తుండటంతో అధికారులు సోమవారం 8 గేట్లను పూర్తిస్థాయిలో పైకెత్తి 64 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతి క్రమేపీ పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ డీఈ తిరుపతి, ఏఈ సంపత్ నిరంతరం సమీక్షిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

