కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, అయితే హద్దులు దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హెచ్చరించారు. మెదక్ పట్టణంలో ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించగా.. మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో రాజయ్య, ఈటల రాజేందర్(Eatala Rajender)ను అకారణంగా తొలగించినట్లు కాంగ్రెస్లో జరగదన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ (KCR) అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ కేవలం సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోలను నమ్ముకున్నారని, ప్రజలు వీటిని నమ్మవద్దని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హరీష్ రావు చేసిన దోపిడీ, భూ కబ్జాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని విమర్శించారు.
మోదీని ఇంటికి పంపడం ఖాయం..
మోదీ సర్కార్ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్నవి ఊడగొట్టిందని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కంపెనీలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మోదీని ఇంటికి పంపడం ఖాయమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పదవులు వస్తాయని, కార్యకర్తలు ఓపిక పట్టాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా పనిచేయాలని మహేష్ గౌడ్ దిశా నిర్దేశం చేశారు.
Also Read : బోల్ట్ రికార్డును బద్దలు కొట్టిన రోబోట్..
Follow Us On : WhatsApp

