కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోర్టు డ్యూటీ అధికారులతో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు సంబంధిత విధులు, పెండింగ్ కేసులు, సమన్లు, వారెంట్ల అమలు, పెండింగ్ ట్రయల్ కేసులు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
జారీ, అమలు, కోర్టు వారెంట్ల అమలు, పెండింగ్ ట్రయల్ కేసుల పురోగతి, ఈ-పెట్టీ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలను సంబంధిత ఆన్లైన్ వ్యవస్థల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కోర్టుల్లో పెండింగ్లో ఉన్న పెండింగ్ ట్రయల్ కేసులు, వారెంట్లను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ సూచించారు. ఈ-పెట్టీ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు, పరిష్కారమైన కేసుల వివరాలను సంబంధిత ఆన్లైన్ వ్యవస్థల్లో సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు.
కోర్టు డ్యూటీ అధికారులు తమ పరిధిలోని కోర్టు కేసులకు సంబంధించిన సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, కోర్టు విధుల్లో సమర్థత, ఖచ్చితత్వం, సమయపాలన పాటించాలని సూచించారు. కోర్టు సంబంధిత ఇతర పనులను కూడా సమన్వయంతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు.
నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ వినియోగంపై అవగాహన
వారెంట్ల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై అధికారులకు అవగాహన కల్పించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ ద్వారా చట్టబద్ధంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అవసరమైన సందర్భాల్లో సమర్థవంతంగా వినియోగించుకుని, వారెంట్ల అమలును మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.
రాబోయే లోక్ అదాలత్పై ప్రత్యేక దృష్టి
త్వరలో నిర్వహించనున్న లోక్ అదాలత్ నేపథ్యంలో పరిష్కరించదగిన కేసులను ముందుగానే గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేలా సంబంధిత అధికారులు, కోర్టు డ్యూటీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా కోర్టు డ్యూటీ అధికారులు, దర్యాప్తు అధికారులు, సంబంధిత సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని, కోర్టు సంబంధిత ప్రతి అంశాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సూచించారు.

