కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీఎల్పీలో ప్రభుత్వ విప్లు సమావేశమయ్యారు. అనంతరం విప్ లు రాంచంద్రనాయక్, విజయ రమణారావు , ఆది శ్రీనివాస్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లు మంత్రి కొండా సురేఖ (Konda Surekha Controversy) , ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి, సీనియర్ నేతలకు ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్ మాట్లాడుతూ.. సీఎం సమావేశానికి వచ్చేలోపు కొండా సురేఖ, కొండా సుస్మిత క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొండా సుష్మిత వ్యాఖ్యలకు కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి వరంగల్ లో ఒక్కరితోనైనా కొండా ఫ్యామిలీ సఖ్యంగా ఉందా? అని ప్రశ్నించారు. విమర్శలొస్తే బీసీ కార్డు వాడుకుంటారా? అని ప్రశ్నించారు.
ఈ అంశంపై మరో విప్ విజయ రమణారావు మాట్లాడుతూ.. “సుస్మిత తన కూతురు కాదని సురేఖ చెబుతారా?” అంటూ ప్రశ్నించారు. అవసరమైతే మంత్రి పదవి నుంచి, పార్టీ నుంచి సస్పెండ్ చేసే స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సీనియర్లను పక్కన పెట్టి సురేఖకు మంత్రి పదవి కట్టబెడితే ఇదేనా పద్ధతి? అని ఆయన ప్రశ్నించారు. సురేఖ, సుస్మిత ఇద్దరూ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీని బద్నాం చేస్తారా? అని నిలదీశారు.విప్ ల డెడ్ లైన్ తో కొండా సురేఖ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

