ఈ ఏడాది BPL రద్దు: BCB అధ్యక్షుడు తమీమ్ సంచలన నిర్ణయం!

కలం, స్పోర్ట్స్: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ – 2026 (BPL – 2026) అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ఈ ఏడాది BPL టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) గురువారం ప్రకటించారు. టోర్నీని పూర్తిగా ప్రక్షాళన చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కొన్ని ఫ్రాంచైజీలు లీగ్ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమీమ్ తెలిపారు. 2012లో ప్రారంభమైన ఈ లీగ్, తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. బకాయిలు చెల్లించకపోవడం, బ్యాంక్ గ్యారంటీల సమస్యలతో గత రెండేళ్లలో బోర్డు దాదాపు $3.3 మిలియన్ల లాభాన్ని కోల్పోయిందని ఆయన వెల్లడించారు.

ఫ్రాంచైజీ లీగ్ ద్వారా బోర్డుకు లాభం రావాలి తప్ప నష్టం రాకూడదని, ఈ లోపాలను సరిదిద్దే వరకు నష్టాల్లో లీగ్ నిర్వహించడం సరికాదని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ఆటగాళ్లు తీవ్రంగా నిరాశ చెందుతారని తనకు తెలుసని, కానీ బోర్డు గర్వపడేలా లీగ్‌ను తీర్చిదిద్దడమే అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ లీగ్‌లో గతంలో బెట్టింగ్ ఆరోపణలు రావడంతో ఒక ఆటగాడితో పాటు పలువురు అధికారులను బోర్డు సస్పెండ్ చేసింది.

అంతేకాకుండా, BCB అధికారి నజ్ముల్ ఇస్లాం వ్యాఖ్యలకు నిరసనగా ఆటగాళ్లు మ్యాచ్‌లను బహిష్కరించిన సంఘటనలు జరిగాయి. ఆటగాళ్ల వికాసం కోసం U-17, U-19, U-23 జట్లతో ‘గేమ్ డెవలప్‌మెంట్ ట్రోఫీ’ ప్రారంభోత్సవంలో తమీమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలలైనా లేదా ఏడాది సమయం తీసుకుని అయినా లీగ్‌ను సరైన పద్ధతిలో పునరుద్ధరిస్తామని, త్వరలోనే విదేశీ ఫ్రాంచైజీలను కూడా ఆహ్వానించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>