కలం, పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎన్డీపీఎస్ కేసు (Ramgiri NDPS Case)లో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం శిక్ష విధించింది. నిందితులు ఏ1 జైస్వాల్ మీనా, ఏ2 తహేరా బేగంలకు పెద్దపల్లి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.సునీత ఒక్కొక్కరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే.. 2018 ఫిబ్రవరి 18న పన్నూర్ గ్రామంలోని జేఎన్టీయూహెచ్ కళాశాల సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో రామగిరి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏ1 జైస్వాల్ మీనా వద్ద 4 కిలోలు,ఏ2 తహేరా బేగం వద్ద 3 కిలోలు, మొత్తం 7 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.70,000గా అంచనా వేశారు.
నిందితులపై రామగిరి పోలీస్ స్టేషన్లో క్రైం నంబర్ 26/2018గా, ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సి)తో పాటు 20(సి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు అనంతరం నిందితులపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయగా, కేసు విచారణకు వచ్చింది. కేసులో నేరం రుజువు అయ్యేలా ప్రభుత్వ న్యాయవాది శ్రీ అర్ధ కుమార్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, కేసును న్యాయస్థానంలో పటిష్టంగా నిరూపించేందుకు కృషి చేసిన ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో, సీఐ బుద్ధె స్వామి, ఎస్హెచ్ఓ టి.శ్రీనివాస్ అందించిన సహకారాన్ని అప్పటి దర్యాప్తు అధికారి టీ.శంకరయ్య, సీఐ సిహెచ్. నతేష్, సీఐ జి.సతీష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అర్థ కుమార్, కోర్టు విధుల్లో సహకరించిన ఎస్కె షాహాబాజ్ పీసీ -648, ఎ.మల్లేష్ పీసీ – 10, లైజన్ ఆఫీసర్ పి.కోటేశ్వరరావు హెచ్సీ 2465లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ అభినందించారు.

