కలం, వెబ్డెస్క్: టెస్టు సిరీస్కు ముందు ఆటగాళ్లకు తగినంత ప్రిపరేషన్ సమయం కావాలని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) స్పష్టం చేశాడు. కనీసం వారం నుంచి పది రోజుల సమయం ఉంటే ఆటగాళ్లు పరిస్థితులకు బాగా అలవాటు పడతారని చెప్పాడు. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు భారత్ సిద్ధమవుతోంది. శనివారం గాలే వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో భారత్ కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ను మొదలుపెట్టనుంది. ఫార్మాట్లు మారినప్పుడు టెస్టు క్రికెట్కు వెంటనే మారడం ఆటగాళ్లకు అంత సులభం కాదని గిల్ పేర్కొన్నాడు.
ముఖ్యంగా విదేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పాడు. అందుకే సిరీస్కు ముందు కొంత సమయం దొరికితే ఆటగాళ్లకు ఉపయోగపడుతుందని వివరించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడమే తమ ప్రధాన లక్ష్యమని గిల్ చెప్పాడు. అందుకోసం ఐదు నుంచి ఆరు టెస్టుల్లో గెలవాల్సి ఉంటుందని తెలిపాడు. జట్టు ప్రస్తుతం మంచి దిశలోనే ముందుకు వెళ్తోందని పేర్కొన్నాడు. ఇక గాలేలో భారత్కు మరో సవాల్ ఎదురుకానుంది. అక్కడ స్పిన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
గాలేలో శ్రీలంకకు మంచి రికార్డు కూడా ఉంది. 1998 నుంచి ఆ వేదికపై జరిగిన 49 టెస్టుల్లో శ్రీలంక 27 మ్యాచ్లు గెలిచింది. ఇటీవల టెస్టుల్లో భారత్కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ను విజయంతో మొదలుపెట్టాలని జట్టు భావిస్తోంది. 2017లో చివరిసారి శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడిన భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇప్పుడు గిల్, గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు కూడా మంచి ఆరంభంపై దృష్టి పెట్టింది.

